Wednesday, May 23, 2007

చాటువులు - chatuvulu

అప్పట్లో రాయల సీమలో వర్షాలు లేక పోతే, శ్రీ నాధుడు శివునిపై రాసిన పద్యం --

"సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."


ఒక కన్ను పోయిన రాజు తన ఆస్థాన కవులను, అతని కళ్ళను పొగుడుతూ పద్యం రాయమన్నాడుట. రాయలేని వారందరూ శిక్షార్హులు. అప్పుడు ఒక కవి ఈ చాటువు వ్రాసారు.
"అన్నాతి గూడ హరుడవే
అన్నాతిని గూడనప్పు డసుర గురుడవే
అన్నా! తిరుమల రాయా!
కన్నొక్కటి మిగిలె గాని కౌరవ పతివే !"





ఒక తుంటరి అబ్బాయి ఈ క్రింది పద్యంలో
"ఒసే! దరిద్రపు దానా! కొంచం సున్నం తెచ్చి పెట్టవే!" ... అంటే

పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి
యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి(/తండ్రి)
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేగదే సుందరాంగి(/సన్నుతాంగి)

( పార్వతి, శివుడు, మన్మథుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి,
సముద్రుడు(/అతని భార్య), జ్యేష్ఠా దేవి (దరిద్ర దేవత) )

ఆ గడుసరి అమ్మాయి ఇలా అని సున్నం ఇచ్చిందట !(తమలిపాకులోకి)
"ఓరి కుక్కా! ఇదుగో సున్నం!"

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో
( కమలము, సూర్యుడు, కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు,
చంద్రుడు, శివుడు, గణపతి, ఎలుక, పిల్లి, కుక్క )


ఈ క్రింది వాటిని "చాటువులు" అని అనవచ్చో, లేదో తెలియదు. కొత్త పాళి గారు లాంటివారు ఎవరైనా సరిదిద్దగలరు.


గురజాడ అప్పా రావు గారు కన్యా శుల్కం లో

కం. ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్.
"Pure Buffalo"

ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో ఉందని గిరీశం తన శిష్యుడైన వెంకటేశానికి చెబుతాడు.






మా చిన్నప్పుడు సోషల్ మాస్టారు చెప్పిన పద్యం

దురదాం గోకడం చైవ
ప్రస్తుతం సుఖమేవ చ
తరువాత మంటా ప్నోతి
ఇత్యైవ దురద లక్షణం

1 comment:

  1. Man, ain't you on a roll here!
    చాటువుల సంగతేమో గానీ మీ మేష్టారి దురద శ్లోకం మాత్రం బ్రహ్మాండం - నవ్వలేక చచ్చాను.
    తమాషాగా నువ్వు ఉటంకించినవన్నీ కందపద్యాలే ఒక్కటి తప్ప
    గిరీశం చెప్పినట్టు కన్యాశుల్కంలో గురజాడా రాసిన పద్యం ఇదీ:
    కం. ఖగపతి యమృతము తేగా
    భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
    పొగచెట్టై జన్మించెను
    పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్.
    ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో ఉందని గిరీశం తన శిష్యుడైన వెంకటేశానికి చెబుతాడు.

    ReplyDelete